కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ కుప్పకూలింది: గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలతో కలకలం

  • పార్టీని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది
  • నేతను ఎన్నికల విధానంలో ఎన్నుకోవాలి
  • మార్పు మొదలైతేనే విజయాలకు చేరువ కావచ్చన్న ఆజాద్
కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థ సంస్థాగతంగా కుప్పకూలి పోయిందని పార్టీ సీనియర్ ‌నేత గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పార్టీని ఉద్దేశించి సంచలన లేఖ రాసిన 23 మందిలో ఆజాద్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.  "మా పార్టీ వ్యవస్థ కుప్పకూలిపోయింది. దీన్ని తిరిగి పునర్నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీలో ఎవరైనా నేతను ఎన్నికల విధానంలో ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేస్తుంది" అని అన్నారు.

అయితే, కేవలం నేతను మార్చినంత మాత్రాన విజయాల బాటలో నడవలేమని, అలా చేసినంత మాత్రాన బీహార్, యూపీ, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలను గెలుచుకుంటామని తాను అనడం లేదని, అయితే, ఒకసారి వ్యవస్థలో మార్పు మొదలైతే, ఆపై దక్కాల్సిన విజయాలకు చేరువ కావచ్చని ఆయన అన్నారు. కపిల్‌ సిబాల్‌ విమర్శల్లో లోపాలు ఎత్తిచూపుతూ  ఇది నాయకత్వ సమస్య కాదని ఆజాద్ అభిప్రాయపడ్డారు.

ప్రజలకు కాంగ్రెస్‌ నేతలకు మధ్య సంబంధం తెగిపోయిందని వ్యాఖ్యానించిన ఆయన, నేతలు స్టార్ హోటళ్లను వీడి క్షేత్ర స్థాయిలోకి రావాలని, క్షేత్ర స్థాయిలో పనిచేస్తేనే ఫలితాలు కనిపిస్తాయని అన్నారు. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా ఉందని, అయినా మనమేం కోల్పోతున్నామో గుర్తించాలని సూచించారు.

Congress
Gulam Nabi Azad
Collapse

More Telugu News